ప్రజల భూ సమస్యలను సులువుగా తీర్చడమే భూభారతి చట్టం యొక్క ముఖ్య లక్ష్యం:
బన్సపల్లి భూభారతి అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
లోకల్ గైడ్ :
భూభారతి చట్టం అమలుతో ప్రజల భూసమస్యలు తీరుతాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం దిలావార్ పూర్ మండలంలోని బన్సపల్లి గ్రామంలోని రైతు వేదికలో భూభారతి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరిచిన భూభారతి చట్టం ప్రజలకు ఎంతగానో మేలు కలుగుతుందన్నారు. గతంలో రైతులకు ఎన్నో రకాల భూ సమస్యలు ఉండడం వల్ల, వారికి ప్రభుత్వాలు అందించు రుణాలు, సబ్సిడీ పథకాలు అందక ఎంతగానో నష్టపోయారని అన్నారు. భూభారతి చట్టం వల్ల ఈ సమస్యలన్నీ తొలగిపోయి, ప్రజలకు అన్ని రకాల రుణాలు అందుతాయి అని తెలిపారు. గత చట్టంలోని అంశాలను సరళతరం చేయడం వల్ల భూముల రిజిస్ట్రేషన్, వారసత్వ పట్టా మార్పిడి, తదితర అంశాలు సులువుగా పరిష్కారం అవుతాయన్నారు. ఇక నుంచి భూసమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరగనవసరం లేదు అని తెలిపారు. అధికారులంతా తమకు వచ్చిన భూసమస్యలను చట్టం ప్రకారం విధించిన నిర్ధిష్ట గడువులోపల పరిష్కరించాల్సిందే అని అన్నారు. సాదా బైనమా ప్రక్రియ అమలులోకి వస్తుందని తెలిపారు. భూభారతి చట్టం పూర్తిస్థాయిలో అమలులోకి రాగానే భూ సమస్యలు ఉన్న ప్రజలు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అవగాహన సదస్సుకు హాజరైన పలువురు ప్రజలు తమ భూ సమస్యల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకరగా, కలెక్టర్ వారికి సమాధానాలు ఇచ్చారు. ఈ భూభారతి అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, తహసిల్దార్ అజీజ్ అహ్మద్, ఎంపీడీవో అరుణ, మండల ప్రత్యేక అధికారి శంకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, రైతులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List