భూ భారతి చట్టం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
లోకల్ గైడ్ :
భూ భారతి చట్టం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.శనివారం నల్గొండ జిల్లా, పెద్ద అడిశర్లపల్లి మండల కేంద్రంలో భూ భారతి (భూమి హక్కుల చట్టం- 2025) పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు అవగాహన కల్పించారు.భూమి ఉన్న రైతులు, లేని రైతులు సైతం భూ భారతి చట్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చట్టం ఇదివరకే అమల్లోకి వచ్చిందని, అయితే భూ భారతి పోర్టల్ మాత్రం జూన్ 2 నుంచి అమలులో కి రానుందని తెలిపారు. ధరణిలో లేని అనేక వెసులుబాట్లు భూ భారతిలో ఉన్నాయని, ధరణి పోర్టల్ లో రికార్డులను సవరించే అవకాశం లేదని, భూ భారతి లో రికార్డులను సవరణ చేసుకోవచ్చని తెలిపారు. భూములపై జరిగిన లావాదేవీలన్నింటిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న సంబంధిత గ్రామపంచాయతీ నోటీస్ బోర్డులో అందరికీ తెలిసేలా ప్రచురించడం జరుగుతుందని చెప్పారు. ధరణిలో అనుభవదారు కాలం లేదని, భూ భారతిలో అనుభవదారుకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. మోఖా మీద ఉన్న ప్రతి రైతుకు భూమీ పై హక్కు కల్పించే బాధ్యత రెవెన్యూ శాఖదని ఆమె స్పష్టం చేశారు.భూ భారతిలో తప్పు చేస్తే ఉద్యోగులను ప్రభుత్వ సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగించే అధికారం చట్టంలో ఉందని వెల్లడించారు. అందువల్ల రైతులు భూ భారతి చట్టంపై ఎలాంటి ఆపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని అన్నారు. గతంలో సమస్య పరిష్కారం కాక పోయిన అన్యాయాలు జరిగినా భూ భారతిలో సవరించడం జరుగుతుందని తెలిపారు.రెవెన్యూ అదనపు ఇంచార్జ్ కలెక్టర్ మరియు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ సమయంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, తహసిల్దార్ ,ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలు చుట్టూ తిరిగినప్పటికీ పనులు కాలేదని, భూ భారతిలో అలాంటి బాధ లేదని తెలిపారు. ధరణిలో రికార్డులు లేకుంటే సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు తహసిల్దార్ వద్దనే రికార్డులు ఉంటాయని తెలిపారు. భూ భారతిలో 80 శాతం సమస్యలను తహసిల్దార్ స్థాయిలో పరిష్కారం అవుతాయని, 10 శాతం ఆర్ డి ఓ ,10 శాతం జిల్లా కలెక్టర్ స్థాయిలో పరిష్కరించబడతాయని తెలిపారు. భూమి ఉన్న ప్రతి రైతుకు ఆధార్ కార్డు లాగా భూదార్ కార్డును ఇవ్వడం జరుగుతుందని, రైతులు అందరూ భూ భారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి మాట్లాడుతూ గతంలో సాధాబైనామా,పౌతి,మ్యుటేషన్ తదితర అన్నింటికీ రైతులు సమస్యలు ఎదుర్కొన్నారని, భూ భారతిలో అలాంటి ఇబ్బంది లేదని, కింది స్థాయిలో అన్యాయం జరిగితే పై స్థాయికి అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు.అడిషనల్ ఎస్పీ మౌనిక మాట్లాడుతూ రైతుల భూములకు పోలీస్ తరఫున రక్షణ కల్పిస్తామన్నారు. ప్రతి గ్రామంలో పోలీసు అధికారిని నియమించడం జరిగిందని ,ఎవరైనా భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అందువలన రైతులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. జూన్ 2 నుండి భూ భారతి పోర్టల్ అందుబాటులోకి రానుందని, అందువల్ల రైతులు భూ భారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మండల ప్రత్యేక అధికారి మల్లేశ్వర రావు, తహసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో చంద్రమౌళి, తదితరులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు.
Comment List