శాస్త్ర సాంకేతిక అంశాలలో విద్యార్థులు రాణించేలా తీర్చిదిద్దాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
లోకల్ గైడ్ తెలంగాణ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక అంశాలలో రాణించే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో స్ట్రెంథనింగ్ ఎఫ్ఎల్ఎన్ త్రు ఏఐ టూల్స్ వినియోగంతో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) సంబంధించిన అంశాలపై విద్యార్థులు కంప్యూటర్ ను ఆపరేట్ చేస్తుండగా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించి వాటి వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్, గణిత అంశాలకు సంబంధించిన విషయ పరిజ్ఞానం పెంపొందించేలా ఉపాధ్యాయులు తెలియజేయాలన్నారు. పాఠశాలలో అదనపు అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసి అందజేయాలన్నారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలకు సంబంధించిన వివిధ తరగతి గదులు, కిచెన్ షెడ్ ను కలెక్టర్ పరిశీలించారు. ఇటీవల కొనుగోలు చేసిన క్రీడా సామాగ్రిని పరిశీలించి వాటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు వచ్చిన పలువురు స్థానికులు సాగు, తాగునీరు తో పాటు వీధిదీపాలు, దివ్యాంగుల పింఛన్, తదితర సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అక్కడే ఉన్న ఎంపీడీవో వెంకటేశ్వర్లు ను స్థానిక సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ కక్కిరాలపల్లి లోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సందర్శించారు. అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన వివరాలను స్థానిక అంగన్వాడీ టీచర్ ను అడిగి తెలుసుకున్నారు. అద్దె భవనంలో నిర్వహిస్తున్న ఈ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వ పాఠశాలలోనికి, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనంలోకి మార్చాల అన్నారు.ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, స్థానిక తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఆర్ఐ మల్లయ్య, ఇతర అధికారులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.
Comment List