రమజాన్ మాసం.. వరాల వసంతం
ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ ఖాన్ ఖాస్మీ
లోకల్ గైడ్,ఖమ్మం:
రమజాన్ మహామాసం వరాలు కురిపించే మాసమని, ఈ నెలలో ప్రతి ఒక్కరూ.. ఎంత వీలైతే అంత సమయం ఖురాన్ తో గడపాలని, ధాన ధర్మాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ ఖాన్ ఖాస్మీ అన్నారు. నగర శివారు గొల్లగూడెంలోని తాలిముల్ ఇస్లాం మదర్సాలో ఖత్మే ఖురాన్ వేడుక ఘనంగా జరిగింది. తరావీహ్ నమాజ్ లో కేవలం తొమ్మిది రోజుల్లోనే ఖురాన్ పఠనం పూర్తి చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఖత్మే ఖురాన్ సందర్భంగా దువా చేయడానికి ముందు జరిగిన ఆధ్యాత్మిక సభలో ముఫ్తీ రవూఫ్ ఖాన్ ప్రధాన ఉపన్యాసం చేశారు. మనిషి తన జీవితంలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పొంది.. అల్లాహ్ చూపిన మార్గానికి దగ్గరయ్యేందుకు రమజాన్ కు మించిన మాసం మరొకటి లేదన్నారు. ఈ నెలలో ఒక సత్కార్యం చేస్తే.. ఏడు రెట్ల పుణ్యం లభిస్తుందని ఆయన చెప్పారు. అందుకే ఈ మాసాన్ని ప్రతి ఒక్కరూ సత్కార్యాలతో సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మనిషి ఎప్పటికీ అల్లాహ్ పై విశ్వాసం కోల్పోవద్దని, ఆయనను ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఏది అడిగితే అది పొందవచ్చని అన్నారు. ఖురాన్ పఠనం మాత్రమే పూర్తయిందని.. తరావీహ్ నమాజ్ ప్రతి ఒక్కరూ రమజాన్ నెలంతా కొనసాగించాలని ఆయన సూచించారు. ఈ నమాజ్ లో ఖురాన్ వినడం ప్రతి ఒక్కరికీ.. విధిగా నిర్ణయించబడిందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ రమజాన్ ప్రాధాన్యత ను గుర్తించి మెసులుకోవాలని ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ ఖాన్ ఖాస్మీ సూచించారు. అంతకు ముందు మదర్సాలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కు నగరంలోని పలు ప్రాంతాల ముస్లింలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో అఫ్జల్ హసన్, సయ్యద్ ఇస్మాయిల్, యాకుబ్ పాష, ఖాజా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Comment List