హైదరాబాద్ మెట్రో ఫేజ్-II కు అనుమతి ఇవ్వండి
-ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి...
-మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వండి...
- రీజినల్ రింగ్ రైల్... డ్రైపోర్ట్లు మంజూరు చేయండి
-సెమీ కండక్టర్ మిషన్కు అనుమతించండి...
-ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి
లోకల్ గైడ్, ఢిల్లీ: హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు సౌకర్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి ఉద్దేశించిన మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం పదేళ్లుగా హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంలో ఫేజ్-II కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కి.మీ పొడవైన అయిదు కారిడార్లను ప్రతిపాదించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టుకు వెంటనే అనుమతించాలని అభ్యర్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో ఇప్పటికే 90 శాతం భూ సేకరణ పూర్తయినందున ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం పూర్తయితే ఆర్ఆర్ఆర్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలమన్నారు. దక్షిణ భాగం భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి తెలియజేశారు. ఆర్ఆర్ఆర్కు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని పీఎం మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ రీజినల్ రింగ్ రైలు పూర్తయితే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని రైలు మార్గాలతో అనుసంధానత (కనెక్టవిటీ) సులభమవుతుందని ప్రధానమంత్రి మోదీకి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.. రీజినల్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వాలని పీఎంను సీఎం కోరారు. సముద్ర మార్గం లేని తెలంగాణకు వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సులువుగా చేసేందుకు రీజినల్ రింగు రోడ్డు సమీపంలో డ్రైపోర్ట్ అవసరమని, ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్ట్ లను కలిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు తో పాటు రోడ్డును ఆనుకొని రైలు మార్గం మంజూరు చేయాలని ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
Comment List