బాధ్యతాయుత నూతన ఆవిష్కరణలు, నైతిక సాంకేతికతకు కేటీఆర్ పిలుపు

నూతన సాంకేతిక పరిజ్ఞానాలు రెండువైపులా పదునున్న కత్తిలాంటివి

బాధ్యతాయుత నూతన ఆవిష్కరణలు, నైతిక సాంకేతికతకు కేటీఆర్ పిలుపు

-టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకోకుంటే భారీ విధ్వంసం*

-డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయానికి వాడుకోవచ్చు యుద్ధానికి వాడుకోవచ్చు నిర్ణయించుకోవాల్సింది మనమే అన్న కేటీఆర్

-అందరికీ సాంకేతిక అక్షరాస్యత (డిజిటల్ లిటరసీ) లేకుంటే అందరికీ సమాన అవకాశాలు అందించలేమన్న కేటీఆర్

-దేశంలో సైబర్ నేరాలు, ఆన్లైన్ జూదం యొక్క ఘోరాలు భారీగా పెరుగుతున్నాయి

-కేవలం కాలర్ ట్యూన్ పెట్టి వీటిని అరికట్టలేమంటూ కేంద్రానికి కేటీఆర్ చురకలు

-2025 ఎంట్రప్రెన్యూర్ టెక్ & ఇన్నోవేషన్ సమిట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన కేటీఆర్

లోకల్ గైడ్, బెంగళూరు: టెక్నాలజీ ప్రపంచాన్ని మలచడంలో ఉన్న అవకాశాలను వినియోగించుకునే విధంగా నూతన ఆవిష్కరణలు సాగాలని, సాంకేతికత అభివృద్ధి కావాలి, కానీ అది సమాజానికి మేలు చేయాలని తెలంగాణ మాజీ ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. 'ఎంట్రప్రెన్యూర్ టెక్ & ఇన్నోవేషన్ సమిట్ - 2025' లో "డ్రైవింగ్ డిజిటల్ ఇండియా: టెక్నాలజీ అభివృద్ధికి మార్గదర్శకతలు, ఆవిష్కరణలు" అనే అంశంపై గురువారం ఆయన కీలకోపన్యాసం ఇచ్చారు. బెంగళూరులో జరిగిన ఈ సదస్సులో టెక్ లీడర్స్, పాలసీ మేకర్లు, స్టార్టప్ వ్యవస్థాపకులతో కేటీఆర్ మాట్లాడారు.సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, కానీ ప్రతి సాంకేతిక ఆవిష్కరణ వెనుక మానవ అవసరాలు, నైతిక విలువలు నిలకడగా ఉండాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI), క్వాంటమ్ కంప్యూటింగ్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (XR), ఇంటర్నెట్ ఆఫ్ బాడీస్ (IoB) వంటి సాంకేతిక పరిణామాలు ఎలా ప్రపంచాన్ని మార్చగలవో వివరించారు. "రేడియోలు మాయమయ్యాయి, టీవీలు వచ్చాయి, ఇప్పుడు పాడ్‌కాస్టుల హవా. ఫార్మాట్ మారుతుండొచ్చు, కానీ మానవ అవసరాలు ఎప్పటికీ మారవు," అని ఆయన అన్నారు.సాంకేతికతను బాధ్యతగా ఉపయోగించకపోతే అది ప్రమాదకరమవుతుందని కేటీఆర్ హెచ్చరించారు. భవిష్యత్తు నిర్మాణం అంటే కేవలం రేపటి రోజుల్లో జీవించడం కాదు అని… రేపటిని నిర్మించడం అని కేటీఆర్ అన్నారు. ఇదే స్ఫూర్తితో సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని టెక్నాలజీ అభివృద్ధి జరగాలన్న ఆవశ్యకతను నొక్కి చెప్పారు. డ్రోన్స్ వ్యవసాయాన్ని సమర్థవంతంగా మార్చగలవని ప్రశంసించిన ఆయన, అదే డ్రోన్స్ విధ్వంసానికి ఉపయోగిస్తే అది ప్రమాదకరం అని హెచ్చరించారు. అందుకే ప్రతి టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని హెచ్చరించారు. ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవితంతో పని వేసుకుంటున్న కొద్ది… సాంకేతిక ప్రగతి పెరుగుతున్న కొద్దీ.. సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని, టెక్నాలజీ సామర్థ్యం అధికంగా ఉన్న యువత సైబర్ నేరాలకు ఎందుకు పాల్పడుతున్నారు ఆలోచించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాల పైన కేవలం ఒక కాలర్ ట్యూన్ పెట్టి…ఆపలేమని కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు. అంతేకాక, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వలన జరుగుతున్న దుష్పరిణామాలను ఆపడం ప్రభుత్వాలు నడిపే వారికి పెద్ద సవాలుగా మారింది అన్నారు. సాంకేతిక అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ అంశాన్ని అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని కేటీఆర్ ప్రస్తావించారు."ప్రతి రోజూ భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వాటి విద్యుత్, వాటర్ వినియోగంపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు," అని అన్నారు.అంతేకాక, టెక్నాలజీ వల్ల పర్యావరణంపై కలిగే ప్రభావం గురించి తగిన అధ్యయనం లేకుండా ముందుకు వెళితే భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుందని హెచ్చరించారు. "ఐఓటీ, మోబైల్ యాప్‌లు, డేటా స్టోరేజ్ – ఇవన్నీ పెరుగుతున్నాయి. కానీ, అవి ఎంతగా పర్యావరణ భంగాన్ని కలిగిస్తున్నాయో ఆలోచించాలి," అని స్పష్టం చేశారు.కర్ణాటకలో కన్నడ భాష అంశం పట్ల జరుగుతున్న ఆందోళనల పైన కూడా కేటీఆర్ మాట్లాడారు. ప్రస్తుతం తమ మాతృభాషల పట్ల జరుగుతున్న వివక్ష గురించి మాత్రమే కాకుండా టెక్నాలజీ తెలిసినవారు టెక్నాలజీ తెలవని వారు అని సమాజంలో ఏర్పడుతున్న సరికొత్త విభజనపైన దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. టెక్నాలజీ నిరక్షరాస్యత ఉన్న జనాభా కి ఏ విధంగా సహాయం చేయాలో ఆలోచించాలని కేటీఆర్ అన్నారు. డిజిటల్ విభజన పెరుగుతున్నకొద్దీ సమాజంలో మరింత విభజన వస్తుందని… టెక్నాలజీ అందరికీ సమానంగా అందినప్పుడే సమాన అవకాశాలు ఏర్పడతాయి అన్నారు. సినిమా డైలాగ్‌తో తన ప్రసంగాన్ని ముగించిన కేటీఆర్, "టర్మినేటర్" లోని ఓ డైలాగ్ ను ప్రస్తావించారు. అంతేకాక, "హస్తా లా విస్టా" అనే హాలీవుడ్ డైలాగ్‌తో పాటు "నమస్కార… శుభవాగళి!" అంటూ కర్ణాటక ప్రజలను ఉద్దేశించి ముగించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News