వరంగల్ కోటను పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేస్తాం
వరంగల్ కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ సత్య శారదా దేవి.
లోకల్ గైడ్ తెలంగాణ:
కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ కలెక్టర్ సత్య శారద దేవి, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే శనివారం వరంగల్ కోట ప్రదేశాలను మరియు మొగిలిచెర్ల గ్రామాన్ని పరిశీలించి, పర్యావరణ పర్యాటక మరియు వారసత్వ పర్యాటక, సాంస్కృతిక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలకు ప్రణాళికా రూపొందించి పనులను వేగవంతం చేయాలని సంబందిత శాఖల అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ కోటను మరింత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో భాగంగా కోట లోని శృంగారపు భావి, ఖుష్మహాల్ పరిసరాలను, గుండు చెరువు చుట్టూ నిర్మిస్తున్న బండ్ ప్రదేశాన్ని, ఏకశిలా పార్క్, మరుగున పడిన కాటేజ్ లకు మరమ్మత్తులు, కాకతీయుల వారసత్వమయిన దేవాలయాలు ఇతర ప్రదేశాల అభివృద్ది మరియు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే దిశగా పనిచేయాలని.. సందర్శకులకు మంచి పర్యటక ప్రదేశంగా అభివృద్ది చేయాలని అన్నారు. కాకతీయుల కీర్తి ప్రతిష్టలను దశదిశలా వ్యాపింపచేసిన అద్భుత నిర్మాణం వరంగల్ కోటని.. దక్షిణ భారతదేశ వాస్తు శిల్ప కళకు గొప్ప తార్కాణంగా నిలిచిందని.. వరంగల్ కోటను పరిరక్షించుకుంటే రామప్ప లాగే దీనికి కూడా యునెస్కో వారసత్వ గుర్తింపు దక్కే ఆస్కారం ఉంటుందని తెలిపారు. రాజులు, రాజ్యాలు పోయిన వారు నిర్మించిన కోటలు, రాజ ప్రసాదలు, ప్రజా వినియోగ భవనాలు, దేవాలయాలు, భావులు, చెరువులు వంటి ఎన్నో సాంస్కృతిక చిహ్నాలు గత కాలపు వైభవాలకు, వాస్తుకళా నైపుణ్యాలకు నిదర్శనాలుగ మన కళ్ళముందే ఉన్నాయని, ఇటీవల ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఇందుకు ఉదాహరణ అని అన్నారు. పర్యాటక రంగానికి దోహదపడే వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి మాట్లాడుతూ .. వరంగల్ కోటను మరింత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో భాగంగా, చారిత్రక కట్టడాలను మరింత అందంగా తీర్చిదిద్దడం, పర్యాటకులకు కావల్సిన వసతులు కల్పించడం మరియు స్థానికంగా పర్యాటక రంగం అభివృద్ధికి దోహదపడే విధంగా పనులు చేయాలని సూచించారు. వ్యాపారాలు, గైడ్స్, రవాణా సౌకర్యాలు, మరియు ఇతర సేవలు అందుబాటులోకి తేవాలని పర్యాటక ప్యాకేజీలు, వన్ డే టూర్ ప్యాకేజీలు కల్పించడం.. వేయి స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, రామప్ప, లక్నవరం, ఖిలా వరంగల్ ఈ ప్రాంతాలను సందర్శించేందుకు పర్యాటకుల సౌకర్యార్థం టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకురావడం తదితర అంశాలను ప్రస్తావించారు.ఈ కార్యక్రమంలో ఆర్కియాలజీ, పర్యటకరంగం అధికారులు, వరంగల్ ఆర్డీవో, కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comment List