పదవ తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం
లోకల్ గైడ్ తెలంగాణ,నిర్మల్
పదవ తరగతి పరీక్షలలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో పదవ తరగతి పరీక్షలపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల్లో జిల్లాలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు. గత రెండు సంవత్సరాలుగా పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలుస్తూ వచ్చామని,ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు.ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తూ బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు.పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. నిరంతరం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ, విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేయాలన్నారు.సబ్జెక్టుల వారిగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులచే వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్నందున వంద శాతం విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, తరచూ పాఠశాలకు హాజరు కాని విద్యార్థులను గుర్తించి ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులతో మాట్లాడి తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్,డిఈఓ పి. రామారావు,ఎంఈఓలు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీల ప్రత్యేక అధికారులు ఇతర అధికారులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comment List