గిరిజన కళలపై వేసవి శిబిరం ప్రారంభం
లోకల్ గైడ్ :
గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. ఎ.శరత్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ లో ఉన్న గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థలో గిరిజన కళలపై పాఠశాల విద్యార్థుల కోసం వేసవి శిబిరం ప్రారంభమైంది. మే 7వ తేదీ వరకు కొనసాగనున్న ఈ శిబిరాన్ని గిరిజన గురుకుల సంస్థల కార్యదర్శి శ్రీమతి సీతాలక్ష్మి ప్రారంభించారు. శ్రీమతి సీతాలక్ష్మి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ... ఈ వేసవి కాలంలో ఇంట్లో ఉంటూ సెల్ ఫోన్లు వాడుతూ ఉండడం వల్ల ఆరోగ్యం, మనసు రెండూ చెడిపోతాయని, కాబట్టి హైదరాబాద్ ప్రాంతవాసులకు కూడ అందుబాటులోకి వచ్చిన ఈ గిరిజన కళా వేసవి శిబిరాన్ని అరుదైన అవకాశంగా తీసుకొని గిరిజన కళలు, సంస్కృతిపై అవగాహన, సాధికారత పెంచుకోవాలని హితవు పలికారు. ఇలా తొలిసారి గిరిజన కళలపై హైదరాబాద్ లో వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థను అభినందించారు. కార్యక్రమంలో మరో అతిధిగా పాల్గొన్న గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు శ్రీ సర్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ... తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే గిరిజన కళలను అభివృద్ధిపరుచుకున్నామన్నారు. గిరిజన సహకార సంస్థ
జనరల్ మేనేజర్ శ్రీ సీతారామ్ సంస్థ మార్కెట్లోకి తెచ్చిన గిరిజన ఆహారం ప్రత్యేక విలువల గురించి చెప్పి విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందజేశారు. గిరిజన పరిశోధన సంస్థ సంచాలకులు డా. వి. సముజ్వల రానున్న ఎనిమిది రోజులలో విద్యార్థులు ఏఏ కళలను నేర్చుకోనున్నారో వివరించారు. తెలంగాణ గిరిజన సంస్కృతి, కళల ప్రాధాన్యం, వాటిని ఎలా నేర్చుకోవాలో వివరిస్తూ గిరిజన మ్యూజియం క్యురేటర్ డా. ద్యావనపల్లి సత్యనారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో ఇంజనీర్ శ్రీమతి హేమలత, ఆర్గనైజర్స్, విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comment List