ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
-15 జిల్లాలలో మొత్తం 773 పోలింగ్ స్టేషన్లు, కరీంనగర్లో 103
- కంట్రోల్ రూమ్ నుండి నిరంతర పర్యవేక్షణ
-ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
-15 జిల్లాల బ్యాలెట్ బాక్స్ లో స్వీకరణకు సర్వం సిద్ధం
-ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
లోకల్ గైడ్, కరీంనగర్: గురువారం జరిగేమెదక్- -నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎన్నికల మెటీరియల్, బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రిసైడింగ్ అధికారులకు సిబ్బందికి, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లే రూట్ మ్యాప్ పై రూట్ ఆఫీసర్లతో చర్చించారు. బ్యాలెట్ బాక్సుల లాకింగ్ సిస్టం, సీలింగ్ పై మరోసారి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ మెటీరియల్ సరిచూసుకోవాలని తెలిపారు.ఈ సందర్బంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది, ఉపాధ్యాయ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు 3లక్షల 55 వేల 159 ఉన్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 27 వేల 88 మంది ఉన్నారని తెలిపారు. అన్ని జిల్లాలలో కలిపి 499 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు, 274 టీచర్స్ పోలింగ్ స్టేషన్లో ఉన్నాయని వివరించారు. 93 కామన్ పోలింగ్ స్టేషన్లు ( గ్రాడ్యుయేట్స్, టీచర్స్) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తంగా అన్ని జిల్లాల్లో 773 పోలింగ్ స్టేషన్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 71 వేల 545 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా, 4 వేల 305 మంది టీచర్స్ ఓటర్లు ఉన్నారు.మొత్తం 103 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతుందని, ఇందులో 85 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు కాగా, 18 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. రెవెన్యూ డివిజన్లో వారీగా పరిశీలిస్తే కరీంనగర్ రెవెన్యూ డివిజన్లో 69 గ్రాడ్యుయేట్, 12 టీచర్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. హుజరాబాద్ రెవెన్యూ డివిజన్లో 16 గ్రాడ్యుయేట్ 6 టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అన్నారు.
కరీంనగర్ జిల్లాలో మొత్తం 103 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 312 మంది పోలింగ్ ఆఫీసర్లు, 36 మంది రిజర్వు సిబ్బంది, మొత్తం 451 మంది పోలింగ్ విధుల్లో ఉన్నారని తెలిపారు. జిల్లాలో 36 మంది మైక్రో అబ్జర్వర్లు, 12 మంది సెక్టార్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.ఈ ఎన్నికలలో ఓటర్లు ఓటు వేసేందుకు ఓటరు గుర్తింపు కార్డుతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపించి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.ఈ నెల 27న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం అన్ని జిల్లాల నుండి బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో గల రిసెప్షన్ సెంటర్కు తరలిస్తామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత తో 144 సెక్షన్ అమలు ఉంటుందని తెలిపారు. సీసీ కెమెరాల నిఘా తో పాటు కంట్రోల్ రూమ్ నుండి నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదిత ఓటర్లుగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు తమ ఓటు వినియోగించుకునేందుకు ప్రత్యేక సెలవు వర్తిస్తుందని తెలిపారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థ లేదా ఇతర అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్, అథారిటీలలో పని చేస్తూ గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులు సైతం వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి, వెసులుబాట్లు ఇవ్వాలని కోరారు.ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీవో మహేశ్వర్, ఇతర జిల్లా అధికారులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు
Comment List