ఎంపీలు వద్దిరాజు, సురేష్ రెడ్డి,దీవకొండ,బండి విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడుతో భేటీ
లోకల్ గైడ్ తెలంగాణ:
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర,విప్ దీవకొండ దామోదర్ రావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డిలు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రాంమోహన్ నాయుడుతో భేటీ అయ్యారు.పార్లమెంట్ ప్రాంగణంలోని మంత్రి ఛాంబర్ లో మంగళవారం సాయంత్రం ఎంపీలు ఆయనతో సమావేశమై తెలంగాణలో విమానశ్రయాల ఏర్పాటుపై చర్చించారు.మామూనూర్ (వరంగల్) విమానాశ్రయం పనులు మొదలు పెట్టి త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా కోరారు.నిజాం కాలంలో నిర్మించిన మామూనూర్ నుంచి గతంలో విమాన సర్వీసులు నడిచాయని,ఇక్కడ నుండి తిరిగి విమానాలు ప్రారంభిస్తే వరంగల్, దాని పరిసర జిల్లాలకు చెందిన ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఎంపీలు సురేష్ రెడ్డి, రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డిలు మంత్రి రాంమోహన్ నాయుడుకు వివరించారు.అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి సమీపాన ప్రతిపాదిత విమానశ్రయం ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిందిగా వారు మంత్రిని కోరారు.సింగరేణి సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు నవభారత్,ఐటీసీ, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ సహా పలు పరిశ్రమలు నెలకొన్నాయని,దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చేపోయే భక్తులకు ఇక్కడ ఏర్పాటు చేసే విమానాశ్రయం సౌకర్యవంతంగా ఉంటుందని మంత్రి నాయుడుకు బీఆర్ఎస్ ఎంపీలు సురేష్ రెడ్డి, రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డిలు వివరించారు. అదేవిధంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల సమీపాన ప్రతిపాదిత విమానశ్రయాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందిగా ఎంపీలు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.
Comment List