స్కూళ్లలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాల్సిందే
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. అన్ని బోర్డుల స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి మొదలు 10వ తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశించింది. విద్యార్థులకు తెలుగు భాషపై పరీక్షలను కూడా నిర్వహించాలని తెలిపింది.
విద్యార్థులు తెలుగు భాషను అభ్యసించేలా చర్య లు తీసుకోవాలని పాఠశాలలను ఆదేశించింది. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు తగిన పర్యవేక్షణ చేపట్టాలని సూచించింది. విద్యార్థులకు సరళమైన విధానంలో బోధించడం, వారిలో అభిరుచిని పెంపొందించడానికి వీలు గా 9, 10 తరగతుల పాఠ్యాంశంగా ‘వెన్నెల’ అనే తెలుగు వాచకం పుస్తకాన్ని తీసుకొచ్చింది. దీనివినియోగానికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి డా.యోగితా రాణా మంగళవారం మెమో జారీ చేశారు. ఈ పుస్తకం ఆధారంగా సీబీఎస్ఈ , ఐసీఎస్ఈ, ఐబీ బోర్డుల యాజమాన్యాలు 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
8 వరకు త్రిభాషా సూత్రం అమల్లో ఉన్నందున ఆంగ్లం, హిందీతోపాటు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు. తొమ్మిది, పది తరగతుల్లో మాత్రం రెండు భాషా సబ్జెక్టులే ఉంటాయి. అందులో ఒకటి ఆంగ్లం తప్పనిసరిగా ఉంటుంది. మరొకటి హిందీ లేదా వేరే భాషను చదువుకుంటున్నారు. ఇక నుంచి ద్వితీయ భాషగా తెలుగును తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరంలో 9వ తరగతిలో, ఆ తర్వాత సంవత్సరంలో పదిలో తెలుగు సబ్జెక్టును విధిగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టంచేసింది.
Comment List