ఎస్ఎల్బీసీలో గల్లంతైన 8 మంది జాడ కోసం అన్వేషణ కొనసాగుతోంది: మంత్రి జూపల్లి
లోకల్ గైడ్,దోమలపెంట: ఎల్ఎల్బీసీ సొరంగంలో శిథిలాల తొలగింపు, డీ వాటరింగ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ఓ వైపు రెస్క్యూ టీం మరోవైపు యంత్రాలతో ఈ పనులు సమాంతరంగా కొనసాగుతున్నాయని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సీఎస్ శాంతికుమారి ఎస్ఎల్బీసీ టెన్నెల్ లో జరుగుతున్న సహాయక చర్యలపై శనివారం సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు, శిథిలాల తొలగింపు, డీవాటరింగ్ పనుల పురోగతిపై రెస్క్యూ టీం, ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జేపీ క్యాంప్ కార్యాలయం వద్ద మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. మొత్తం 8 మంది గల్లంతు కాగా జీపీఆర్ ద్వారా ఇప్పటికే ఆ నలుగురి జాడ కనుగొన్నారని, ఆ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయని, రేపటి సాయంత్రంలోగా అక్కడ సహాయక చర్యలు పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ కింద మరో నలుగురి ఆనవాళ్లు కన్పించినట్లు తెలుస్తోందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా 200 కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్వామని చెప్పుకునే బీఆర్ఎస్ నాయకులు తమ పదేండ్ల పాలనలో ఎస్ఎల్బీసీ సొరంగాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. అప్పుడే పూర్తి చేసి ఉంటే ఈ ఘటన జరిగేది కాదోమోనని తెలిపారు. సొరంగంలో చాల క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయని, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు సహాయక చర్యల్లో నిర్లక్ష్యం ఏమి లేదని, ఎస్ఎల్బీసీపై నిస్సిగ్గుగా రాజకీయ విమర్భలు చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
Comment List