భూ భారతి చట్టం ద్వారా పెండింగ్ భూ సమస్యలకు పరిష్కారం
లోకేశ్వరం భూభారతి అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
లోకల్ గైడ్ :
రైతులకు వారి భూములపై సమగ్ర హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూ భారతి (నూతన ఆర్.ఓ.ఆర్) - 2025 చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధరణి ద్వారా పరిష్కారం కాని సమస్యలకు కొత్త భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయ భూములపై పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ప్రభుత్వం క్రమబద్ధీకరించేందుకు వీలు కల్పించిందని వివరించారు. భూముల హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణ కోసం కొత్త చట్టం అమలులో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని, ఆ దరఖాస్తులను ఆర్డీఓ, కలెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అభ్యంతరాలుంటే కలెక్టర్ దగ్గర అప్పీల్, ఆపై ల్యాండ్ ట్రిబ్యూనల్ వద్ద అవకాశాలు ఉన్నాయని వివరించారు. పురాతన అప్పీల్ వ్యవస్థలతో పోలిస్తే, ఈ కొత్త రెవెన్యూ కోర్టుల ద్వారా రైతులకు వేగవంతమైన న్యాయం లభిస్తుందని చెప్పారు. భూసమస్యలు, భూ వివాదాలపై రైతులకు ఉచిత న్యాయ సహాయం అందుతుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి వార్షికంగా వాటిని ప్రజల ముందు ప్రదర్శిస్తారని, ఆధార్ తరహాలో భూమికి ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయించి ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గ్రామాల్లో గ్రామ పాలన అధికారుల నియామకంతో రైతుల భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయన్నారు.రైతులు అడిగిన వివిధ భూ సమస్యలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు.అనంతరం లోకేశ్వరంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలన్నారు. వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు. ఎండలు అధికంగా ఉన్నందున రైతులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా టెంట్ తప్పకుండా ఉండాలన్నారు. నిరంతరం రైతులకు త్రాగు నీటిని అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి సంబంధించిన రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. వరి కొనుగోలుకు సంబంధించిన అన్ని రకాల రిజిస్టర్లను తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సరిపడినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. నిర్నిత సమయానికి వరి కోనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, తహసిల్దార్ మోతీరామ్, ఎంపిడిఓ రమేష్, నిర్మల్, భైంసా ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు భీమ్ రెడ్డి, ఆనంద్ రావు పటేల్, పిఎసిఎస్ ఛైర్మెన్ రత్నాకర్ రావు, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List